Spread The Love

గుర్రంపోడు ఫిబ్రవరి25 (నేటిదర్శిని):
గుర్రంపోడు తహసిల్దార్ జి.కిరణ్ కుమార్ ను విధుల పట్ల నిర్లక్ష్యం, జిల్లా యంత్రాంగం ఆదేశాల బేఖాతరు కారణంగా సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. గుర్రంపోడ్ తహసిల్దార్ జి.కిరణ్ కుమార్ విజ్ఞప్తి మేరకు గత నెల 6 నుండి 16 వరకు జిల్లా కలెక్టర్ సెలవును మంజూరు చేశారు. అయితే సెలవు ముగిసిన అనంతరం జనవరి 17న విధులలో చేరవలసి ఉండగా, కిరణ్ కుమార్ విధులలో చేరకుండా సెలవును జనవరి 31 వరకు పొడిగించారు. ఆ తదుపరి మరోసారి ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 28 వరకు సెలవును పొడిగించాలని దరఖాస్తు చేసుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం, రేషన్ కార్డులు, రైతు భరోసా తదితర పథకాల కింద లబ్ధిదారుల ఎంపికతో పాటు, కేంద్ర ఎన్నికల సంఘం వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ జారీ చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కిరణ్ కుమార్ కు సెలవును మంజూరు చేయలేదు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని వెంటనే విధులలో చేరాలని కోరడంతో పాటు, జిల్లా యంత్రాంగం ఆదేశాలను బేఖాతరు చేసినందుకు గాను వివరణ ఇవ్వాలని కోరుతూ  జి.కిరణ్ కుమార్ కు షోకాజ్ నోటీసు జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ ఫిబ్రవరి 25 వరకు కిరణ్ కుమార్ విధులలో చేరకపోవడమే కాకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం, స్పందించకపోవడం వల్ల ప్రభుత్వ ప్రాధాన్య పథకాల అమలులో జిల్లా యంత్రాంగానికి తీవ్ర ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో సెలవులో ఉన్న గుర్రంపొడు తహసిల్దార్ జి.కిరణ్ కుమార్ ను విధుల నుండి  సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని, సస్పెన్షన్ కాలంలో సెలవు పై ఉన్న  తహసిల్దార్ జి. కిరణ్ కుమార్ ముందస్తు అనుమతి లేకుండా కార్యస్థానం వదిలి వెళ్ళకూడదని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.