Spread The Love

గుర్రంపోడు ఫిబ్రవరి25 (నేటిదర్శిని):
నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం తేనెపల్లి తండాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. డిసిసిబి బ్యాంకు సిబ్బంది వేధింపులు తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే, వడిత్య జవహర్ లాల్ అనే రైతు బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించమని బ్యాంకు మేనేజర్ ఉదయకుమార్, ఫీల్డ్ ఆఫీసర్ శంకర్ రైతును తీవ్రంగా వేధించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బ్యాంకు సిబ్బంది రైతు పొలంలో జెండాలు పాతి, ఇంటికి వెళ్లి మరింత ఒత్తిడి తేవడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన జ్వహార్లాల్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు తక్షణమే అతడిని నల్లగొండలోని గొల్లగూడెం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు కుటుంబాన్ని పరామర్శించి, బాధ్యులైన బ్యాంకు మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్‌లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నేటి దర్శిని ప్రతినిధి ఈ విషయంపై బ్యాంకు మేనేజర్ ను సంప్రదించగా మేము కేవలం నోటీసులు ఇవ్వడానికే వెళ్ళామని తెలియజేశారు.