చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలకు పార్టీల గ్రీన్‌ సిగ్నల్‌

536944-adilabad

పలు మున్సిపాలిటీల్లో నేడు పాలకవర్గాల ఏర్పాటు

నేటి దర్శిని (వెబ్ న్యూస్ డెస్క్): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పలు పురపాలక సంఘాల్లో నేడు పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ముఖ్యంగా నిర్మల్, చెన్నూరు, లక్షెట్టిపేట, అలాగే మంచిర్యాల కార్పొరేషన్‌లో స్పష్టమైన మెజారిటీ ఉండడంతో పాలకవర్గాల ఏర్పాటు సులభంగా పూర్తికానుంది. మిగిలిన మున్సిపాలిటీల్లో మాత్రం పొత్తులు, స్వతంత్రుల మద్దతుతో ఉత్కంఠ కొనసాగుతోంది.

నిర్మల్‌లో ఒకే కుటుంబం నుంచి నాలుగోసారి

నిర్మల్ పురపాలక సంఘంలో చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు లాంఛనమే కానున్నాయి. చైర్‌పర్సన్‌గా అప్పాల కావ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఒకే కుటుంబం నుంచి నాలుగోసారి ఈ పదవి దక్కనుండడం విశేషం. గతంలో ఆమె తాత అప్పాల నరసయ్య, అత్త అనురాధ మహేష్‌, భర్త గణేష్ చక్రవర్తి చైర్మన్‌లుగా సేవలందించారు.

చెన్నూరులో మంత్రి సూచన మేరకు

చెన్నూరులో చైర్‌పర్సన్‌ ఎంపిక మంత్రి వివేక్ వెంకటస్వామి సూచనల మేరకు జరిగే అవకాశం ఉంది. పెద్దింటి పద్మ, సుద్దపెల్లి సునీతల్లో ఒకరు ఎంపిక కానున్నట్లు సమాచారం.లక్షెట్టిపేటలో చైర్‌పర్సన్‌గా దొంత అంజలి నరసయ్య ఎన్నికయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇతర మున్సిపాలిటీల్లో ఉత్కంఠ

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మిగిలిన పట్టణాల్లో చైర్మన్‌ పదవులపై స్పష్టత ఇంకా రాలేదు.

  • బైంసాలో స్వతంత్రుల పాత్ర కీలకం. ఎంఐఎం బలం పెరిగితే జాబీర్ అహ్మద్ మళ్లీ చైర్మన్‌ కావచ్చని ప్రచారం, అయితే పూర్తి మద్దతుపై అనుమానాలు ఉన్నాయి.
  • ఆదిలాబాద్లో బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కలిసి స్వతంత్ర అభ్యర్థిని ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. ఆ పరిణామంలో బండారి అనూషకు అవకాశం ఉండొచ్చు. బీజేపీ నుంచి ఆకుల శైలజ బరిలోకి దిగే అవకాశముంది.
  • ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్‌ తరఫున అబ్దుల్లా బిన్ అహ్మద్, బీఆర్‌ఎస్‌ నుంచి చిలువేరు వెంకన్న పోటీలో ఉన్నారు.
  • ఖానాపూర్‌లో బీజేపీ–బీఆర్‌ఎస్‌ పొత్తు కుదిరినట్లు ప్రచారం జరుగుతూ, బీజేపీ అభ్యర్థికి అవకాశాలు ఉన్నట్లు సమాచారం.