ప్రభుత్వ ఆసుపత్రిలో వికటించిన వైద్యం

WhatsApp Image 2025-11-15 at 7.04.41 AM

17 మంది చిన్నారుల అస్వస్థత – ఐసీయూకు తరలింపు

గ్లూకోస్, ఇంజక్షన్ ఇచ్చిన కొద్ది సేపటికే చిన్నారుల్లో పరిస్థితి విషమం

డ్యూటీ డాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యంపై ఆరోపణలు,పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన

హాలియా,నవంబర్ 15 (నేటి దర్శిని): నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హాలియాలోని కమల నెహ్రూ ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి జరిగిన వైద్యుల నిర్ల్యక్ష్య ఘటన కలకలం రేపింది. పిల్లల వార్డులో చేరి చికిత్స పొందుతున్న మొత్తం 17 మంది చిన్నారులకు సిబ్బంది గ్లూకోస్, ఇంజక్షన్లు వేసిన కొద్ది సేపటికే పరిస్థితి విషమించింది. చిన్నారులు ఒక్కసారిగా చలి జ్వరం, వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కొందరు చిన్నారులు వణుకుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తల్లిదండ్రులు తెలిపారు. పరిస్థితి తీవ్రమవడంతో పిల్లల వార్డులో ఉన్న డాక్టర్లు వెంటనే అప్రమత్తమయ్యారు. ఒకేసారి 17 మంది పిల్లలు అస్వస్థతకు గురవ్వడం నేపథ్యంలో వైద్య బృందం అత్యవసర చర్యలు చేపట్టింది. చిన్నారులను వెంటనే పిల్లల ఐసీయూకు తరలించి చికిత్స అందించడం ప్రారంభించారు. రాత్రి ఆలస్యంగా కూడా ఐసీయూలో వైద్యం కొనసాగుతోందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనతో చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ‘‘పిల్లలకు ఇంజక్షన్ ఇచ్చిన కొన్ని నిమిషాల్లోనే పరిస్థితి మారిపోయింది. ఇది స్పష్టమైన నిర్లక్ష్యం’’ అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సిబ్బంది అందించిన మందులు గడువు ముగిసినవా? లేక డోసింగ్ లో తప్పిదమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తక్షణమే బాధ్యులైన డ్యూటీ డాక్టర్, నర్సింగ్ స్టాఫ్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అస్పత్రిలో భద్రతా ప్రమాణాలు, ఔషధాల నిర్వహణ, పిల్లల వార్డులో ప్రోటోకాల్స్ పాటిస్తున్నారా? అనే అంశాలపై ఆరోగ్య శాఖ దర్యాప్తు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో స్థానిక ప్రజల్లో కూడా ఆగ్రహం వెల్లువెత్తింది.