న్యూస్ డెస్క్ (నేటి దర్శిని): రాష్ట్రంలోని రైతులకు వానాకాలం పంట పెట్టుబడి సాయం అందించడంలో తెలంగాణ ప్రభుత్వం సరి కొత్త రికార్డును నమోదు చేసింది. 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు జమ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈసారి వేగంగా రైతుల ఖాతాల్లో నిధులను జమ చేస్తుంది. ఈ సారి జూన్16న రైతు నేస్తం వేదికగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా చెల్లింపులను ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి 6 రోజుల్లోనే 66.19 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.7,770.83 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. శనివారం నాటికే రాష్ట్రంలో 9 ఎకరాల్లోపు భూములున్న రైతులందరి ఖాతాల్లో జమయ్యాయి. నిధులు గత ఏడేళ్లలో ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద మొత్తంలో రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేయడం ఇదే మొదటిసారని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, వానాకాలం పంటలకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం గరిష్టంగా 169 రోజుల వరకు సాగదీసినట్లు గత రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. వ్యవసాయ శాఖ వద్ద అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం 2021లో 11 రోజుల వ్యవధిలో రూ.7360 కోట్లు జమ చేయడం రికార్డు. కానీ రేవంత్ సర్కార్ అంతకంటే వేగంగా 6 రోజుల్లోనే ఏకంగా రూ.7,770 కోట్లు పంపిణీ చేసింది. 9 రోజుల్లో మొత్తం రూ.9 వేల కోట్ల పంపిణీని విజయవంతంగా పూర్తి చేయాలని ఆర్థికశాఖ భావిస్తోంది.
రైతు భరోసా సరికొత్త రికార్డు…
