చైతన్యపురి, డిసెంబర్09 (నేటిదర్శిని): తనకు ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగేందుకు వెళ్లిన ఓ కాంట్రాక్టర్, అతని అనుచరులపై దాడికి పాల్పడిన బిజెపి నాయకుడుపై చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదయింది. బాధితులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పెద్దపల్లి జిల్లాకు చెందిన దాసరి హనుమయ్య, ఆర్ కే పురం డివిజన్ బిజెపి కార్పొరేటర్ రాధ భర్త ధీరజ్ రెడ్డికి వచ్చిన సీతరామ లిఫ్ట్ ఇరిగేషన్ 7బ్లాక్ లో 2018 సంవత్సర కాలం నుండి మైనింగ్ పనులు చేయడానికి సబ్ కాంట్రాక్టు తీసుకున్నాడు. దీనికి సంబంధించిన డబ్బులు రూ. 64 లక్షల మొత్తానికిగాను మిగతా రూ.31 లక్షలు ఇవ్వవలసి ఉంది. డబ్బులు అడిగేందుకు శనివారం సాయంత్రం కొత్తపేట ఆర్కే పురం లోని ధీరజ్ రెడ్డి ఆఫీస్ కు తన అనుచరులతో కలిసి హనుమయ్య వెళ్ళాడు. ఈ క్రమంలో హనుమయ్య, ధీరజ్ రెడ్డి ల మధ్య వాగ్వివాదం జరిగింది. హనుమయ్య వెంట వెళ్లిన భాస్కర్ అనే వ్యక్తిని ధీరజ్ రెడ్డి దుర్భాషలాడాడు. అనంతరం హనుమయ్య పై దాడి చేయగా తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగింది. వెంటనే ఆ దుస్తులు విప్పి కొత్త దుస్తులు వేయించి బయటకు పంపించారు. దీంతో హనుమయ్య భాస్కర్, తన అనుచరులతో కలిసి చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ కింద ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చైతన్యపురి పోలీసులు ధీరజ్ రెడ్డి పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. కాగా హనుమయ్య తన కార్యాలయానికి వచ్చి తన అనుచరుడు దళిత మోర్చ నాయకుడు ప్రవీణ్ కుమార్ ను కులం పేరుతో దూషించాడని ధీరజ్ రెడ్డి సైతం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. ఇరువురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ధీరజ్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలి.. హనుమయ్య కుమార్తె దాసరి ఉష
మా నాన్నను డబ్బులు ఇస్తానని చెప్పి తన కార్యాలయానికి పిలిపించి పథకం ప్రకారమే హత్యకు కుట్ర చేసాడని దాసరి హనుమయ్య కూతురు పెద్దపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే దాసరి ఉష ఆరోపించారు. ఈ మేరకు సోమవారం చైతన్యపురి పోలీస్ స్టేషన్ ముందు తన అనుచరులతో కలిసి ధర్నా చేశారు. రక్తంతో తడిసిన బట్టలతో చంపవద్దని కాళ్లపై ప్రాధేయపడినా ధీరజ్ రెడ్డి విడవలేదని వెంటనే అతడిని అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి దాసరి హనుమయ్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నామమాత్రపు కేసులు నమోదు చేశారని ఆమె ఆరోపించారు. ధర్నా జరుగుతున్న సమయంలో చైతన్యపురి సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై భద్రయ్య తన సిబ్బందితో కలిసి ధీరజ్ రెడ్డి కార్యాలయానికి చేరుకున్నారు. అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు పిలుస్తున్నాడని చెప్పి ధీరజ్ రెడ్డిని పోలీసులు వెంటబెట్టుకొని ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈ విషయమై అడిషనల్ డిసిపి కోటేశ్వరరావును వివరాలు చెప్పాలని కోరగా ఆయన మాట్లాడుతూ హనుమయ్య, ధీరజ్ రెడ్డిలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారని తెలిపారు. రెండు కేసులు విచారణలో ఉన్నాయని పూర్తిస్థాయిలో విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.