చైతన్యపురి డిసెంబర్09 (నేటిదర్శిని): సీతారామ ప్రాజెక్ట్ కు కెనాల్ బ్లాస్టింగ్ కాంట్రాక్టు హనుమయ్యది కాదని వేరొకరికి హనుమయ్య సబ్ కాంట్రాక్టరని ఆర్ కే పురం బీజేపీ నేత ధీరజ్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో బిజెపి రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, కార్పొరేటర్లు రంగా నరసింహ గుప్త, బద్దం ప్రేమ మహేశ్వర్ రెడ్డి తదితర నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. హనుమయ్య సబ్ కాంట్రాక్టు పని పూర్తి కాలేదని పని పూర్తికాకుండానే బిల్లులు ఏ విధంగా చెల్లించాలని ఆయన అన్నారు. బిల్లు రావాలంటూ హనుమయ్యే నా కార్యాలయంలోకి వచ్చి నాపై దాడికి దిగాడని ఆయన ఆరోపించారు. మర్రిగూడ మండలం ఖుదాభక్షిపల్లి లో గిరిజనుల, దళితుల భూమి 700 ఎకరాలు హనుమయ్య కాజేసాడని, యాదాద్రి భువనగిరి జిల్లాలో 90 ఎకరాల భూమిని ఎకరం 10లక్షల చొప్పున అగ్రిమెంట్ చేసుకుని ఎకరం కోటి రూపాయల వరకు అమ్ముకుని యజమానిని హనుమయ్య మోసం చేసాడని పేర్కొన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దీనికి రాజకీయ రంగు పులిమి హంగామా చేయడమేంటని ప్రశ్నించారు. పూర్వాపరాలు తెలుసుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడితే మంచిదని హితవు పలికారు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత వ్యవహారానికి సంబంధించిన విషయమని బిజెపి పార్టీకి అంట కట్టడం సరైన పద్ధతి కాదన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు హనుమయ్య బినామీగా పనిచేస్తున్నాడా అని అన్నారు. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పై పరువు నష్టం దావా దాఖలు చేస్తానని పేర్కొన్నారు.
హనుమయ్య ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బినామీ
