చింతపల్లి, మే 28 నేటి దర్శిని:చింతపల్లి మండల కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన సాయి సన్నిధికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ .రామచంద్ర రావు విచ్చేసి శ్రీ సాయిబాబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు సాయి సన్నిధి చైర్మన్ మంచికంటి ధనంజయ్, ట్రస్ట్ సభ్యులు, భక్తులు ఘన స్వాగతం పలికారు.అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభ స్వాగతం అందించి ప్రత్యేక వేద ఆశీర్వచనం చేశారు. ఆలయంలోని సాయిబాబా విగ్రహం వద్ద ప్రత్యేక హారతులు ఇచ్చి రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ సాయిబాబా బోధనలు సమాజానికి మార్గదర్శకమని అన్నారు. ప్రేమ, సేవ, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆకాంక్షించారు. ఆలయ ఆధ్యాత్మిక వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉందని, భక్తులకు ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాయి సన్నిధి చైర్మన్ మంచికంటి ధనంజయ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి భక్తుల సహకారం ఎంతో ఉందని తెలిపారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే దిశగా ట్రస్ట్ కృషి చేస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు రామచంద్రరావును శాలువాతో సత్కరించి ఆలయ ప్రసాదం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మంచికంటి ధనంజయ్, ట్రస్టు సభ్యులు, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు సముద్రాల నరేష్, శివర్ల రమేష్, మోర వెంకటరమణ, గజ్జ అభినవ్, బీజేపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




