రంగారెడ్డి, మే 31(నేటి దర్శిని డెస్క్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన విద్యాశాఖ అధికారుల బదిలీలలో భాగంగా రంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా వెంకటేశ్వర్లును నియమించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా డీఈఓగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు, తాజాగా రంగారెడ్డి జిల్లా డీఈఓగా బదిలీపై నియమితులయ్యారు. త్వరలోనే ఆయన కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లా డీఈఓగా సేవలందించిన సుశీందర్ రావు మరో జిల్లాకు బదిలీపై వెళ్లనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లాలో విద్యా పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వెంకటేశ్వర్లు కృషి చేస్తారని విద్యాశాఖ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. విద్యా రంగంలో విశేష అనుభవం కలిగిన వెంకటేశ్వర్లు నియామకంతో జిల్లాలో విద్యా ప్రమాణాల మెరుగుదలకు తోడ్పాటు అందుతుందని అధికారులు, ఉపాధ్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి.
