న్యూస్ డెస్క్ నేటి దర్శిని: బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కొట్లాట మనకు కొత్తది కాదు అంటూ ఆదివారం రైతన్నలకు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. అన్నదాత లారా… రైతు భరోసా నిధుల ఎగవేత మోసాన్ని ఎదిరించాలని సూచించారు. అడ్డగోలు ఆంక్షలతో కోతలతో సగం మందికి ఎగనామం పెట్టాలని చూస్తున్న ఈ ప్రభుత్వ ఎత్తుగడలను చిత్తు చేయాలన్నారు. ప్రతి ఎకరాకు… ప్రతి రైతుకు పెట్టుబడి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాలని పిలుపునిచ్చారు. శాసనసభలో రైతు భరోసా పైన ఏమే చెప్పకుండా ఎటు తేల్చకుండా సంబంధంలేని అంశాలపైకి చర్చను మళ్లించి అసలు సంగతిని సీఎం రేవంత్ రెడ్డి అతి తెలివితో పక్కదారి పట్టించాడని లేఖలో దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి చూస్తుంటే కోతలు… కొర్రీలు పెట్టి రైతు భరోసా ఎగవేయాలని చూస్తుందని అన్నారు. అన్నదాత లారా ఈ మోసాన్ని గ్రహించి రైతు భరోసా పై ఆంక్షలు వద్దని ఆందోళన చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇప్పుడు ఇప్పుడు గనక రైతులు మేలుకోకపోతే రైతు భరోసా ఉండదని రైతు గోస మాత్రమే మిగులుతుందని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ మార్గదర్శకల పైనే ఆధారపడుతుందని లేఖలో దుయ్యబట్టారు. అదే జరిగితే రాష్ట్రంలో సగం మంది రైతులకు కూడా పెట్టుబడి పైసలు రావని హెచ్చరించారు. రైతుబంధు మీద కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం అంతా రైతు భరోసా కు కోతలు పెట్టే దురుద్దేశంతోనే చేస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. రూపాయలు ఇరవై రెండు వేల కోట్ల రియల్ ఎస్టేట్ ప్లాట్లకు… క్రషర్లకు ఇచ్చారని దుష్ట బుద్ధితో దుర్మార్గమైన ప్రచారం చేస్తూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తుందని ఆరోపించారు. చైతన్యవంతమైన తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ సర్కారు ఎత్తుగడలను నక్కజిత్తులను తిప్పి కొట్టాలని గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను గల్లా పట్టి నిలదీయాలని పిలుపునిచ్చారు. రైతుల ఆకాంక్ష ఏంటో.. అభిప్రాయం ఏంటో.. ప్రభుత్వానికి తెలిసేలా సెగ పుట్టించాలన్నారు. మీ ఆందోళనకు అండగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వంచన చేయడానికి చూస్తున్న కాంగ్రెస్ గ్రామాల్లో దంచి కొడదాం… రైతుకు కేసీఆర్ సర్కారు ఇచ్చిన రక్షణ కవచాలను కాంగ్రెస్ కబళిస్తుంటే చూస్తూ ఊరుకోబోమని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.
KTR: బీ ఆర్ ఎస్ అంటే ‘భారత రైతు సమితి’… రైతులకు కేటీఆర్ బహిరంగ లేఖ
