Budjet: 2027 బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట
రైతులకు కేంద్ర బడ్జెట్ భారీ ఊరట, అధిక విలువ పంటలకు ప్రత్యేక ప్రోత్సాహం
నేటి దర్శిని, వెబ్ న్యూస్: దేశ వ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. 2027 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ కీలక ప్రకటనలు చేసింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వ్యవసాయ ఆదాయం పెంచే లక్ష్యంతో అధిక విలువ కలిగిన పంటల సాగుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ఆమె ప్రకటించారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల పెంపకానికి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు, కొబ్బరి రైతుల కోసం ప్రత్యేక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. కాయలు కాయని పాత చెట్ల స్థానంలో కొత్త చెట్లను నాటేందుకు ఆర్థిక సహాయం, జీడిపప్పు, కోకో ఉత్పత్తిని పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే గంధం చెట్ల వనాల అభివృద్ధి, ఆల్మండ్స్, పైన్ నట్స్ సాగుకు ప్రత్యేక పథకాలు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. మహిళా రైతులు, స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రత్యేక మార్కెట్ల ఏర్పాటు కోసం కూడా కేంద్రం ఆర్థిక సహకారం అందించనుందని నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఈ ప్రకటనలతో ఆంధ్రప్రదేశ్కు భారీ ఊరట లభించనుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొబ్బరి తోటల్లో అగ్ని ప్రమాదాలు జరిగి తీవ్ర నష్టం వాటిల్లిన నేపథ్యంలో, ఈ బడ్జెట్ నిర్ణయాలు బాధిత రైతులకు ఉపశమనం కలిగించనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
