నల్లగొండలో మళ్లీ చెలరేగుతున్న “బెగ్గింగ్ మాఫియా”
👉 పసికందులతో భిక్షాటన చేస్తున్న మహిళలు!
👉 ఆపరేషన్ ముస్కాన్ తర్వాత కూడా మారని దృశ్యం!
👉 చైల్డ్ వెల్ఫేర్ అధికారులు నిద్రలో ఉన్నారా..?
👉 రెంటుకు తెచ్చిన పసికందులతో భిక్షాటన – స్థానికుల ఆగ్రహం!
నేటి దర్శిని, (వెబ్ న్యూస్): నల్లగొండ పట్టణంలో మళ్లీ “బెగ్గింగ్ మాఫియా” చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ముఖ్యంగా బస్ స్టాండ్, మార్కెట్ యార్డు, టౌన్ సెంటర్ లాంటి రద్దీ ప్రాంతాల్లో పసికందులను, చిన్నారులను చంకలో ఎత్తుకుని మహిళలు ప్రజలను సెంటిమెంటల్ చేస్తూ భిక్షాటన చేస్తున్నారు.
ఆపరేషన్ ముస్కాన్ ద్వారా గతంలో చైల్డ్ లేబర్, భిక్షాటనలో ఉన్న పసికందులను రక్షించి ప్రభుత్వ సంరక్షణ కేంద్రాలకు తరలించినా, అదే పద్ధతి మళ్లీ మొదలైంది. పరిశీలనలో భాగంగా కొందరు మహిళలు ఈ పసికందులను “రెంటుకు” తీసుకుని భిక్షాటన చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నట్లు బయటపడింది.
రోజు మొత్తం వేడి సూర్యకాంతిలో, దుమ్ము ధూళిలో చిన్నారులను ఎత్తుకుని తిరుగుతున్న దృశ్యం చూసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడే ఈ మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలని, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
సమాజం మొత్తం అప్రమత్తమై ఇలాంటి ఘోరాలను అరికట్టడం, పసికందులను రక్షించడం అందరి బాధ్యత అని పౌరులు భావిస్తున్నారు.
