-పోచబోయిన సురేశ్ యాదవ్పై తీవ్ర ఆరోపణలు..!
-కేసును తప్పుదారి పట్టించేందుకు సెటిల్మెంట్కు యత్నించారా..! పోలీసుల కుట్ర దాగి ఉందా?!
-కేసు వెనక యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ ఉన్నారా..!
ఎల్బీనగర్, సెప్టెంబర్ 19 (నేటి దర్శిని): బైక్ విషయంలో జరిగిన పంచాయితీ అనంతరం తనపై దాడి చేసి, గత మూడు రోజులుగా తీవ్రంగా వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురైన రాజేష్ అనే గిరిజన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని గిరిజన, ప్రజా సంఘాలు ఆరోపించాయి. ఈ ఘటనపై ఎల్బీనగర్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు పోచబోయిన సురేశ్ యాదవ్పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గిరిజన (ఎరుకల) సామాజిక వర్గానికి చెందిన రాజేష్పై బైక్ విషయంలో జరిగిన పంచాయితీ సందర్భంగా సురేశ్ యాదవ్ విచక్షణారహితంగా దాడి చేశారని, అనంతరం కూడా మూడు రోజుల పాటు వివిధ రకాలుగా వేధింపులకు గురిచేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ వేధింపులను తాళలేక రాజేష్ అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడని వారు పేర్కొన్నారు.
మృతుడి కుటుంబంపై ఒత్తిడి?
రాజేష్ ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ రంగంలోకి దిగారని గిరిజన, ప్రజా సంఘాలు ఆరోపించాయి. కేసును తప్పుదారి పట్టించేలా మృతుడి తల్లితో సెటిల్మెంట్ చేసేందుకు ప్రయత్నించారని వారు పేర్కొన్నారు. తన మనవడు సురేశ్ యాదవ్కు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు చెప్పాలని, అందుకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని మృతుడి తల్లికి ఫోన్లో చెప్పినట్లు ఈశ్వరమ్మ యాదవ్పై ఆరోపణలు వచ్చాయి. తన మనవడి రాజకీయ భవిష్యత్తును నాశనం చేయవద్దంటూ బాధితురాలిపై ఒత్తిడి తెచ్చారని గిరిజన సంఘాల ప్రతినిధులు ఆరోపించారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
రాజేష్ మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని గిరిజన, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, పోచబోయిన సురేశ్ యాదవ్లపై ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ) చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వారు కోరుతున్నారు. అలాగే రాజేష్పై దాడి, వేధింపులు, అనంతరం చోటుచేసుకున్న ఆత్మహత్యకు మధ్య ఉన్న సంబంధంపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని, బాధిత కుటుంబంపై ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

