గుర్రంపోడులో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు
గుర్రంపోడు, జూన్ 18 (నేటి దర్శిని ప్రతినిధి): రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ఫీజుల నియంత్రణ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల తక్షణ విడుదలతో పాటు విద్యా రంగ సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించ తలపెట్టిన ‘ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి’ కార్యక్రమం నేపథ్యంలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు తరలిపోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. గుర్రంపోడు మండల పరిధిలోని పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులను పోలీసులు గురువారం తెల్లవారుజాము నుంచే అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో మండల నాయకులు వేముల యాదయ్య, మేడి లింగయ్య, పోలేపల్లి యాదయ్య, మైదాస్ లింగస్వామి, రమేష్ నాయక్, కుందారపు యాదగిరి, జాల చంద్రయ్య తదితరులు ఉన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ముందస్తు అరెస్టులు చేపట్టినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మండలంలోని ప్రధాన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉండగా, విద్యార్థుల సమస్యలపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమైన తమ నాయకులను అకారణంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకే ప్రభుత్వం నిర్బంధ చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యా రంగ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని, అదుపులోకి తీసుకున్న నాయకులను తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశాయి.
