విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
కరాటే, కిక్ బాక్సింగ్ విద్యార్థులకు బెల్టులు, మెడల్స్, షీల్డుల అందజేత

ఎల్.బీ.నగర్ జూన్10 (నేటి దర్శిని): శరీర దారుఢ్యానికి, మానసికోల్లాసానికి కరాటే శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. యొద్ద గోజురియు స్పోర్ట్స్ కరాటే డు ఆర్గనైజేషన్ ఇండియా మాస్టర్ తీగల శ్రీనివాస్, కిక్ బాక్సింగ్ కోచ్ అరుణ్ సింగ్ ఆధ్వర్యంలో కరాటే, కిక్ బాక్సింగ్ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థినీ విద్యార్థులకు మంగళవారం ఉదయం హైదరాబాద్ ఎల్బీనగర్ లో బెల్టుల ప్రదానోత్సవాన్ని ఏర్పాటు చేశారు. బెల్టుల ప్రదానోత్సవానికి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు బెల్టుల ప్రదానం చేయడంతో పాటు మెడల్స్, షీల్డ్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు చదువుతో పాటు క్రీడారంగంలో రాణించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. కరాటే, కిక్ బాక్సింగ్ విభాగాల్లో విద్యార్థినీ విద్యార్థులకు మాస్టర్లు మంచి తర్ఫీదును ఇస్తున్నారని మాసర్ శ్రీనివాస్, కోచ్ అరుణ్ సింగ్ లను అభినందించారు. అంతకుముందు రాజ్ కుమార్ రెడ్డిని మాస్టర్లు శాలువలతో సత్కరించి, షీల్డ్ ను బహూకరించారు. ఈ కార్యక్రమంలో కోచ్ కార్తీక్, కిక్ బాక్సింగ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దేవేందర్, అధిక సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మాస్టర్లు పాల్గొన్నారు.