పేటలో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకి ప్లాట్లు
జర్నలిస్టులకు వరాల జల్లు కురిపించిన భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి
నారాయణపేట ఏప్రిల్03 (నేటి దర్శిని):
నారాయణపేట నియోజకవర్గంలో వివిధ పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్న ప్రతి జర్నలిస్టు సంక్షేమానికి కృషి చేస్తానని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో వివిధ పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నారాయణపేట నియోజకవర్గంలో పని చేస్తున్న విలేకరులు ఎలాంటి ఆదాయం లేకుండా నిస్వార్థంగా పని చేస్తున్నారని ఆయన కొనియాడారు. నియోజకవర్గ ప్రజల అభివృద్ధితో పాటు, జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా తమ ఫౌండేషన్ కృషి చేస్తుందని అన్నారు. ఈ ప్రాంత బిడ్డగా ఇక్కడి ప్రజలు, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు తనకు తెలుసునని, ఆయా సమస్యల పరిష్కారానికి ప్రణాళికబద్దంగా చర్యలు తీసుకుంటున్నానని పేర్కొన్నారు. నియోజకవర్గంలో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకు ప్లాట్లు ఇచ్చే విధంగా తమ ఫౌండేషన్ కృషి చేస్తున్నామని తెలిపారు. దీనితోపాటు నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను ఎప్పటికి ఎప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కూడా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నియోజకవర్గంలో చదువుకు దూరమైన విద్యార్థుల ఉన్నత విద్య కోసం, పేదల వైద్యానికి ఆర్థిక సహాయాన్ని అందించినట్లు వివరించారు. నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, దేవాలయాల్లో నీటి బోర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ప్రెస్ క్లబ్ కు టీవీ, కుర్చీల అందజేత
నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉన్న ప్రెస్ క్లబ్ కు భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎల్ఈడి టీవీ, కుర్చీలు ఫ్యానును ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె. రాజ్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మధుసూదన్ రెడ్డి, రుద్రారెడ్డి, తిప్పన్న, శివరాజ్, నరసింహనాయుడు, వై.సంతోష్, హనుమంతు, అశోక్, నందకుమార్, చామకూర నగేష్, ఐజేయు జిల్లా అధ్యక్షులు నారాయణరెడ్డి, టియుడబ్ల్యూజే హెచ్-143 జిల్లా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు లొట్టి శ్రీను తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.