విధులకు గైహాజరైన సిబ్బందిపై వేటు
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కఠిన చర్యలు
గుర్రంపోడు (నేటిదర్శిని): నల్గొండ జిల్లా గుర్రంపోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సిబ్బంది ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనందుకు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కఠిన చర్యలు తీసుకున్నారు. బుధవారం ఆకస్మిక తనిఖీ సందర్భంగా, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్తో సహా మొత్తం సిబ్బంది విధుల్లో లేకపోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఫార్మసిస్టు శ్యామ్, ల్యాబ్ టెక్నీషియన్ సంధ్య, డేటా ఎంట్రీ ఆపరేటర్ మాధవి, అటెండర్లు శ్రీనివాస్, అరుణజ్యోతి, ఎల్లమ్మలను ఉద్యోగాల నుండి తొలగించారు. రెగ్యులర్ సిబ్బంది అయిన ఫార్మసిస్టు భాగ్యమ్మ, అటెండర్ లక్ష్మీనారాయణను విధుల నుండి సస్పెండ్ చేశారు.

ప్రభుత్వం బుధవారం ఎలాంటి సెలవు ప్రకటించనప్పటికీ, వైద్య సిబ్బంది ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడం బాధాకరమని, ఇది ప్రజల ఆరోగ్య సంక్షేమంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కలెక్టర్ అన్నారు.
అదేవిధంగా, “విధుల పట్ల నిర్లక్ష్యం చూపిన ప్రతి ఉద్యోగిపై ఇలాంటే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వైద్యానికి ప్రాధాన్యతనిచ్చే రాష్ట్రంలో, ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేయడం అసహ్యకరమైనది” అని ఆమె హెచ్చరించారు.
