-
బిఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు నాయకులు గంజి కృష్ణ
మిడ్జిల్, ఏప్రిల్ 17, (నేటి దర్శిని ప్రతినిధి): మిడ్జిల్ మండల బిఆర్ఎస్ సీనియర్ నాయకులు
గంజి కృష్ణ ఒక ప్రకటనలో పేర్కొంటూ, తేజస్వి సూర్య లోక్సభలో చేసిన తెలంగాణపై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ విభజనను భారత్–పాకిస్థాన్ విభజనతో పోల్చడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్య అని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఎవరి భిక్ష వల్ల ఏర్పడినది కాదని, వేలాది మంది యువకుల త్యాగాలు, సుదీర్ఘ ప్రజాస్వామ్య పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. ఒక ప్రజాస్వామ్య పోరాటాన్ని దేశ విభజన వంటి విషాదకర సంఘటనతో పోల్చడం అనేది అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. పార్లమెంట్ వేదికగా తెలంగాణను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, తేజస్వి సూర్య వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని గంజి కృష్ణ డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర నాయకత్వం, ముఖ్యంగా నరేంద్ర మోదీ స్పందించి ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన ఎంపీలు రాష్ట్ర గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని, ఇటువంటి సందర్భాల్లో మౌనం పాటించడం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ అనేది ఒక త్యాగాల గాథ అని, స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిన ఈ గడ్డను అవమానిస్తే తెలంగాణ సమాజం ఊరుకోదని హెచ్చరించారు. రాష్ట్ర హక్కులు, గౌరవం కోసం భారత్ రాష్ట్ర సమితి ఎల్లప్పుడూ ప్రజల తరఫున పోరాడుతుందని గంజి కృష్ణ స్పష్టం చేశారు.




