Kalvakuntla Kavitha: కవిత కోసం ప్రశాంత్ కిశోర్..?
కొత్త పార్టీ కోసం పొలిటికల్ స్ట్రాటజిస్ట్ వ్యూహాలు..!
నేటి దర్శిని (వెబ్ డెస్క్): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె హింట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కవిత ఏర్పాటు చేయబోయే పార్టీ కోసం పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇప్పటికే వైసీపీలాంటి ప్రాంతీయ పార్టీలకు పని చేసిన పీకే.. నెక్స్ట్ కవిత కోసం పనిచేయబోతున్నారని టాక్. రెండు నెలల వ్యవధిలో ప్రశాంత్ కిశోర్ హైదరాబాద్కు వచ్చి కవితను రహస్యంగా సమావేశం అయ్యారని పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతున్నది. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్లో వీరి సమావేశం జరిగినట్లు కూడా ఓ న్యూస్ బయటకు వచ్చింది.
ఎలా ముందుకు వెళ్లాలి..?
తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఐదు రోజులపాటు ప్రశాంత్ కిషోర్తో కవిత సమావేశం అయ్యారని సమాచారం. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేశాక ఎలా ముందుకు వెళ్లాలి? ఎలాంటి స్ట్రాటజీతో పార్టీని డెవలప్ చేయాలనే అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగి నట్లు సమాచారం. ప్రజల కోణంలో పార్టీ విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే 50 కమిటీలను కవిత ఏర్పాటు చేశారని తెలిసింది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సాయంతో పార్టీని కూడా లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే, రాజకీయ వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిశోర్ జన్ సురాజ్ పార్టీ పెట్టి ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అభ్యర్థులను పోటీలో దింపి ఘోర ఓటమి చెందిన విషయం తెలిసిందే. తమిళనాడు రాష్ట్రంలో దళపతి విజయ్ టీవీకే పార్టీకి ప్రశాంత్ కిషోర్ సలహాదారుగా ఉన్నారు. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల సమ యంలోనూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ప్రశాంత్ కిశోర్ పలుమార్లు హైదరాబాద్ లో సమావేశమయ్యారు. అయితే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ప్రస్తుతం పీకే సలహాలు కవిత పార్టీకి ఏ మేరకు కలిసి వస్తాయో వేచిచూడాలి.
