Nagarjuna: మంత్రి కొండా సురేఖపై కేసు వాపసు తీసుకున్న నాగార్జున

Nagarjuna

హైదరాబాద్‌,నవంబర్ 3(నేటి దర్శిని): మంత్రి కొండా సురేఖ(Konda Surekha), ప్రముఖ నటుడు నాగార్జున(Nagarjuna) మధ్య నెలకొన్న వివాదానికి తెర పడింది. నాగార్జునను ఉద్దేశిస్తూ మంత్రి సురేఖ నిన్న ఎక్స్‌ వేదికగా క్షమాపణలు చెప్పారు. ఆమె బహిరంగ క్షమాపణలను పరిగణనలోకి తీసుకున్న నాగార్జున, తమకు న్యాయం జరిగిందని భావించి.. క్రిమినల్ దావా పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. నాగార్జున కుటుంబంపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నానని మంత్రి కొండా సురేఖ నిన్న ఎక్స్‌లో పోస్టు చేసిన విషయం తెలిసిందే. ‘‘నాగార్జున, ఆయన కుటుంబాన్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతో నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు. వారిని ఇబ్బందిపెట్టాలని కాని, వారి పరువు-ప్రతిష్టలకు భంగం కలిగించాలన్నది నా ఉద్దేశం కాదు. నాగార్జున కుటుంబంపై నేను చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా పొరపాటు ఉంటే అందుకు చింతిస్తున్నా. నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా’’ అని పేర్కొన్నారు. దీంతో నాగార్జున, మంత్రి కొండా సురేఖ మధ్య కొన్ని నెలలుగా కొనసాగుతున్న న్యాయపరమైన వివాదానికి తెరపడినట్లయింది.