చాకలి ఐలమ్మ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి: రాజ్ కుమార్ రెడ్డి
- నారాయణపేట,మహబూబ్నగర్ పట్టణాల్లో ఐలమ్మ విగ్రహాల ఏర్పాటుకు కృషి
- చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళులర్పించిన భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి
నారాయణపేట, సెప్టెంబర్26 (నేటి దర్శిని):భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం అహర్నిశలు పోరాటాలు చేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల చాకలి ఐలమ్మ సేవలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధురాలు చిట్యాల చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మహబూబ్నగర్ భగీరథ కాలనీలో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం నాయకులు, బీసీ సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అలుపెరుగని పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఐలమ్మ పోరాటాన్ని ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు.


చాకలి ఐలమ్మ విగ్రహాల ఏర్పాటుకు కృషి: రాజ్ కుమార్ రెడ్డి
మహబూబ్నగర్ జిల్లాతో పాటు నారాయణపేట జిల్లా వ్యాప్తంగా చాకలి ఐలమ్మ విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు సహకరించాలని రజక సంఘం, బీసీ సంఘాల నాయకులు రాజ్ కుమార్ రెడ్డిని కోరగా, దశలవారీగా చాకలి ఐలమ్మ విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీంతో రజక సంఘం, బీసీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం మహబూబ్నగర్ పట్టణ అధ్యక్షులు పగడం మల్లేష్, ఉపాధ్యక్షులు కె.శ్రీనివాస్, ప్రతినిధులు నర్సింహులు, ఆంజనేయులు, వెంకటేష్, చంద్రయ్య, లక్ష్మణ్, బాలకృష్ణ, బీసీ సంఘం నాయకులు కృష్ణ, ఫౌండేషన్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
