ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ఓటు చోరీ హటావో – ప్రజాస్వామ్యం బచావో పోస్టల్ కార్డు ఉద్యమం
ఎమ్మెల్యే బాలు నాయక్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించిన NSUI నాయకులు
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్రపతికి వినతి
దేవరకొండ , సెప్టెంబర్ 03 ( నేటి దర్శిని): ఎన్ఎస్యూఐ (NSUI) చేపట్టిన ‘ఓటు చోరీ హటావో – ప్రజాస్వామ్యం బచావో’ పోస్టల్ కార్డు ఉద్యమంలో భాగంగా, దేవరకొండ శాసనసభ్యుడు బాలు నాయక్ ఆధ్వర్యంలో రాష్ట్రపతికి లేఖ రాసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం దేవరకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది. NSUI జాతీయ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పానుగంటి శ్రీకాంత్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్తో కుమ్మక్కై ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. ఒకే వ్యక్తికి అనేక చోట్ల ఓట్లు ఉన్నట్లు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పటికే రుజువు చేసినా, అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ‘ఒకే వ్యక్తికి ఒకే ఓటు’ అనే రాజ్యాంగ సూత్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్దేనని బాలు నాయక్ స్పష్టం చేశారు. ఈ లోపాలను వెంటనే సరిదిద్దాలని, ఓటు చోరీ విధానాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. “ప్రజాస్వామ్యం సజీవంగా ఉండాలంటే ఓటు హక్కు సురక్షితంగా ఉండాలి. భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం మనందరి బాధ్యత” అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల వెంకటయ్య గౌడ్, దేవరకొండ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు యూనుస్, మాజీ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ పొన్నబోయిన సైదులు, కో ఆప్షన్ సభ్యుడు సాదిక్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు రాంసింగ్ నాయక్, యువజన కాంగ్రెస్ దేవరకొండ టౌన్ వైస్ ప్రెసిడెంట్ పొట్ట ప్రభు, మోహన్ నాయక్ తదితర కాంగ్రెస్, NSUI నాయకులు పాల్గొన్నారు.

4.5