బీఆర్ఎస్ నాయకులపై కవిత సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ జూలై17 (నేటి దర్శిని): బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై ఇప్పటివరకు పార్టీ స్పందించకపోవడాన్ని ఆమె తప్పుపట్టారు. ‘‘ఈ వ్యవహారాన్ని పూర్తిగా పార్టీ విజ్ఞతకే వదిలేస్తున్నా’’ అని మీడియాతో మాట్లాడుతూ ఆమె పేర్కొన్నారు.
ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్పై కవిత తన మద్దతును ప్రకటించారు. “ఇది సరైన నిర్ణయమే, నిపుణులతో చర్చించి నేను దీన్ని సమర్థించాను. సామాజిక న్యాయం కోసం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు బీఆర్ఎస్ నాయకులు వ్యతిరేకంగా వ్యవహరించడం దుర్మార్గం” అంటూ కవిత మండిపడ్డారు.
తాను చేపట్టిన వైఖరి మార్పు కాదని, ఇది ప్రజలకు మేలు చేసే దిశగా తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. ‘‘పార్టీ నేతలంతా నా దారిలో రావాల్సిందే’’ అంటూ ఆమె స్పష్టం చేశారు. కవిత వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ నాయకత్వం స్పందించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో, ఈ వ్యాఖ్యలు రాజకీయ ఉత్సాహాన్ని రేపుతున్నాయి.

5