Newspaper Banner
Date of Publish : 01 May 2026, 11:24 am Digital Edition : NETI DRASHINI

పదవ తరగతిలో అఖిల్ ప్రభంజనం

గుర్రంపోడులో ఘనంగా సన్మానించిన ఎన్నారై నాగులవంచ నర్సింహ రావు

గుర్రంపోడు, మే 01(నేటి దర్శిని): పదవ తరగతి పరీక్షల్లో విశిష్ట ప్రతిభ కనబరిచి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే అత్యున్నత స్థాయి మార్కులు సాధించిన విద్యార్థి యడవెల్లి అఖిల్‌ను ఎన్నారై నాగులవంచ నరసింహారావు ఘనంగా సన్మానించారు. మండల కేంద్రానికి చెందిన అఖిల్ 600 మార్కులకు 583 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో గుర్తింపు పొందడం విశేషంగా నిలిచింది. శుక్రవారం అఖిల్ నివాసానికి వెళ్ళిన నరసింహారావు, విద్యార్థిని, తల్లిదండ్రులను కలిసి అభినందనలు తెలియజేశారు. అఖిల్ సాధించిన విజయాన్ని కొనియాడుతూ శాలువాతో సత్కరించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో పరిమిత వసతులు ఉన్నప్పటికీ పట్టుదలతో కృషి చేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చని అఖిల్ నిరూపించాడని అన్నారు. 583 మార్కులు సాధించడం సాధారణ విషయం కాదని, ఇది విద్యార్థి నిరంతర శ్రమకు, తల్లిదండ్రుల ప్రోత్సాహానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి ప్రతిభావంతులు ఉన్నత విద్యలో కూడా రాణించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అఖిల్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల మార్గదర్శకం మరియు తల్లిదండ్రుల మద్దతుతోనే ఈ విజయాన్ని సాధించగలిగానని తెలిపాడు. భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి సమాజ సేవలో భాగస్వామి కావాలని తన లక్ష్యాన్ని వెల్లడించాడు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యార్థి మిత్రులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొని అఖిల్ విజయాన్ని ఆనందంగా జరుపుకున్నారు.