Newspaper Banner
Date of Publish : 18 January 2026, 12:47 pm Digital Edition : Unknown Author

Manikarnika Ghat: మణికర్ణిక ఘాట్‌పై ఫేక్ ఏఐ చిత్రాలు.. కాంగ్రెస్, ఆప్ నేతలతో సహా 8 మందిపై కేసు

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న ప్రఖ్యాత మణికర్ణిక ఘాట్‌ అభివృద్ధి పనులకు సంబంధించి సోషల్ మీడియాలో కృత్రిమ మేధ (AI)తో సృష్టించిన ఫేక్ చిత్రాలు, తప్పుడు ప్రచారం చేసినందుకు 8 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మణికర్ణిక ఘాట్‌లో జరుగుతున్న సుందరీకరణ పనులకు సంబంధించి వాస్తవాలకు విరుద్ధంగా, కల్పిత చిత్రాలను ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా కొందరు ప్రచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ చిత్రాలలో హిందూ దేవతలను అవమానకరంగా చూపించారని, తద్వారా మత విశ్వాసాలను దెబ్బతీసి, ప్రజల్లో ఆగ్రహం రెచ్చగొట్టేందుకు, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించారని అధికారులు ఆరోపించారు.

ఈ విషయంపై ఏసీపీ అతుల్ అంజన్ మాట్లాడుతూ.. “మణికర్ణిక ఘాట్‌లో జరుగుతున్న పనులకు సంబంధించి అనేక తప్పుడు పోస్టులు, చిత్రాలు సర్క్యులేట్ అయ్యాయి. భవిష్యత్తులో ఇలాంటివి పోస్ట్ చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు. ఎఫ్ఐఆర్‌ నమోదు చేసిన వారిలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేతలు కూడా ఉన్నారని ఆయన వెల్లడించారు.

ఘాట్‌లో అభివృద్ధి పనులు చేపడుతున్న సంస్థ ప్రతినిధి చౌక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2025 నవంబర్ 15 నుంచి తాము పనులు చేస్తున్నామని, జనవరి 16న రాత్రి ఒక ఎక్స్‌ యూజర్ ఏఐ-జనరేటెడ్ చిత్రాలను షేర్ చేసి, ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పోస్టులకు అభ్యంతరకరమైన కామెంట్లు, రీపోస్టులు రావడంతో ఉద్రిక్తతలు పెరిగాయని పోలీసులు గుర్తించారు. వదంతులు వ్యాప్తి చేసేవారిపై చర్యలు కొనసాగుతాయని, పోస్టులు పెట్టిన వారితో పాటు వాటిని రీపోస్ట్ చేసి, కామెంట్లు చేసిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టం చేశారు.