Newspaper Banner
Date of Publish : 10 November 2025, 6:19 pm Digital Edition : Unknown Author

ముద్దగౌని సతీష్ గౌడ్ సేవలు అభినందనీయం: ఎమ్మెల్సీ మధుసూదనాచారి

ఎల్.బి.నగర్,నవంబర్10(నేటి దర్శిని): ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి పేర్కొన్నారు. సోమవారం వనస్థలిపురంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ ముద్దగౌని సతీష్ గౌడ్ శివ గురుస్వామి ఆధ్వర్యంలో జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై భక్తులకు, స్వాములకు అన్నప్రసాద వితరణ చేశారు. అంతకుముందు మధుసూదనా చారిని సతీష్ గౌడ్ గురుస్వామి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ మాలాధారణ చేసిన స్వాములకు నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సతీష్ గౌడ్ గురుస్వామి సేవలను కొనియాడారు. మాలాధారణ చేసిన స్వాములందరూ మండలకాలం పూర్తయిన తర్వాత కూడా ఆధ్యాత్మిక చింతనతో మెలగాలని సూచించారు. తమను ఆహ్వానించి స్వామివారి సేవలో భాగం చేసినందుకు సతీష్ గురు స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శివ ప్రకాష్,దేవాలయ కమిటీ సభ్యులు సాయినాథ్ రాజ్, కళ్యాణ్,సుబ్బు,సందీప్, పవన్,శివ భక్తులు,అయ్యప్ప స్వాములు, హనుమాన్ స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.