Newspaper Banner
Date of Publish : 08 March 2025, 2:13 pm Digital Edition : Unknown Author

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.. ఎం.ఎల్.సీ కవిత కీలక వ్యాఖ్యలు

నేటిదర్శిని, వెబ్‌డెస్క్: తెలంగాణ భవన్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవవేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్చట్టాన్ని అమలు చేయకపోవడంతో మహిళలు రాజకీయంగా నష్టపోతున్నారని అన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జనగణనతో ముడిపెట్టి కేంద్రం ఇప్పటికీ అమలు చేయడం లేదని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్లు అమలుకానందు వల్ల మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా ఎన్నికల్లో మహిళలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. జనగణనకు బడ్జెట్‌లో ఎందుకు నిధులు పెట్టలేదని ప్రశ్నించారు. త్వరగా జనగణన చేస్తే.. రాబోయే బిహార్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మరింత మంది మహిళలు ఎమ్మెల్యేలవుతారని అన్నారు. ప్రతీ మహిళకు ఇస్తామన్న రూ.2500 హామీని అమలు చేసే వరకూ కాంగ్రెస్ ప్రభుత్వాన్నివెంటాడుతామని కీలక ప్రకటన చేశారు.‘మహిళా సంఘాల ద్వారా అద్దెకు తీసుకుంటున్న బస్సులకు ఆర్టీసీ సకాలంలో కిరాయి చెల్లిస్తుందా?లేదా స్పష్టత ఇవ్వాలి. అంగన్ వాడీ, ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచకపోవడం సరికాదు. మహిళలను ఎలా కోటీశ్వరులను చేస్తారో నిర్దిష్టమైన ప్రణాళికను ప్రభుత్వం బహిర్గతం చేయాలి. కేసీఆర్ మహిళా కేంద్రీకృత పాలన చేశారు. మహిళల కోసం కేసీఆర్ అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టారు. కేరళ ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో మహిళా, పురుషల సమానత్వపు బొమ్మలు ప్రచురిస్తున్నారు. అలాంటి చర్యలు తెలంగాణలో కూడా రావాల్సి ఉంది. సమాజం ఎదుగుదలలో మహిళల పాత్ర గణనీయం. ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు సమాన హక్కులు, గౌరవం, నిర్ణయాధికారం రావాల్సి ఉంది. అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. చాకలి ఐలమ్మ, రాణి రుద్రమాదేవి వంటి వీర మహిళలు తెలంగాణ గడ్డపై పుట్టడం మనకు గర్వకారణం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. వాటన్నింటినీ అధిగమించాల్సిన అవసరం ఉంది’ అని కవిత పేర్కొన్నారు.