Newspaper Banner
Date of Publish : 01 December 2024, 8:14 pm Digital Edition : Unknown Author

మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ను కలిసిన దివ్యాంగులు

దివ్యాంగుల సమస్యలు విన్నవించిన దివ్యాంగుల సంఘం నేతలు…

దివ్యాంగుల సదనాలో సమస్యల పరిష్కారం..

ఉద్యోగ ఉపాధి కల్పించాలని వినతి

ఎల్.బి.నగర్ డిసెంబర్ 01 (నేటి దర్శిని): వికలాంగులను దివ్యాంగులుగా పేరు మార్చిన ఘనత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందని, అలాంటి బిజెపి పార్టీలో దివ్యాంగులకు సముచిత స్థానం కల్పించాలని, దివ్యాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని దివ్యాంగుల రాజ్యాధికార ఫోరం కన్వీనర్ వంశరాజ్ రామచంద్ర, రమేష్ లు ఎల్బీనగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆదివారం రోజు  మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ను కలిసి పలు సమస్యలు విన్నవించి వినతి పత్రం అందజేశారు. దేశవ్యాప్తంగా దివ్యాంగుల చట్టం 2016 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని, గ్రూప్-1,  గ్రూప్-2 గ్రూప్-3  గ్రూప్-4 ఉద్యోగాలలో దివ్యాంగుల రిజర్వేషన్ అమలు చేయడంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని ఎంపీ ఈటలకు వివరించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో దివ్యాంగుల కోసం ఆరు వసతిగృహాలు ఉన్నాయని వాటిలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, దివ్యాంగులకు అనుగుణంగా వసతిగృహాలు లేవని నిత్యం సమస్యలు తాండవిస్తున్నాయని ఎంపీ ఈటల రాజేందర్ కు వివరించారు. ఉన్నత విద్య, డిగ్రీ, పీజీ పీహెచ్డీలు పూర్తి చేసినప్పటికీ సదనంలో ఉన్న దివ్యాంగులకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదని వివరించారు. సదనంలో ఉన్న దివ్యాంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతోపాటు దివ్యాంగులకు ప్రత్యేకంగా ఇండ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. దివ్యాంగులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దివ్యాంగుల సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధ్యక్షులు సామ రంగారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్, ఢిల్లీ వెంకటేష్ ముదిరాజ్, హస్తినాపురం డివిజన్ బిజెపి అధ్యక్షులు నరేష్ యాదవ్  తదితరులు పాల్గొన్నారు.